ప్రజాశక్తి- తిరుపతి టౌన్: వైసిపి, తెలుగుదేశం పార్టీల నుంచి రానున్న ఎన్నికల్లో రాజమండ్రి ఎంపిగా పోటీ చేయాలని ఆఫర్లు వచ్చినట్లు సినీ నటుడు సుమన్ వెల్లడించారు. ఆదివారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను ఆయన దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో చంద్రబాబు తనకు గురువని చెప్పారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి, వైసిపిల నుంచి తనను పోటీ చేయాలని అవకాశం వచ్చినట్లు తెలిపారు. ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలకు మేలు చేసే మేనిఫెస్టోకే తన మద్దతు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులకు, యువతకు, మహిళలకు, రైతులకు మేలు చేసే మేనిఫెస్టో ఉండాలని సూచించారు. మేనిఫెస్టో రూపొందించిన పార్టీలు వాటిని సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా హామీలు ఇవ్వడం తగదన్నారు. రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడకుండా వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.