- కొనసాగుతున్న యాత్రికుల రద్దీ
ప్రజాశక్తి- తిరుమల : తిరుమలలో గత మూడు రోజులుగా యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులతో తిరుమల పోటెత్తింది. విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ వద్ద నుంచి క్యూలైన్లలో యాత్రికులు బారులు తీరారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల నివేదిక ప్రకారం ఆక్టోపస్ సర్కిల్లో లైన్లోకి ప్రవేశించిన యాత్రికులకు శ్రీవారి దర్శనం దాదాపు 24 గంటల సమయం పడుతోంది. టిటిడి ఇఒ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు యాత్రికుల సౌకర్యాలు, క్యూలైన్లను నిరంతరాయంగా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మాతశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు యాత్రికుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, తాగునీరు అందించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది.