ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం నుంచి జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభకు పోటీ చేసేందుకు సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య టిడిపి వద్ద లేకపోవడంతో పోటీ నుంచి విరమించుకుంది. ఈ మేరకు వైసిపి అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్రెడ్డి, గొల్ల బాబురావు ఏకగ్రీవమైనట్లు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరాజు మంగళవారం ప్రకటించారు. దీంతో రాష్ట్రానికి రాజ్యసభ నుంచి వుండే 11 రాజ్యసభ స్థానాలను వైసిపి క్లీన్ స్వీప్ చేసినట్లయింది. తాజా ఎన్నికలతో రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పార్టీ ఏర్పడిన 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టిడిపి సభ్యులు లేని పరిస్థితి వచ్చింది.