ప్రకాశంలో హోరాహోరీ !

  •  వైసిపి, టిడిపి కుస్తీ
  •  ఇండియా బ్లాక్‌ ముమ్మర ప్రచారం

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : ప్రకాశం జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు 115 మంది, ఒంగోలు ఎంపి స్థానానికి 25 మంది బరిలో ఉన్నా… వైసిపి, తెలుగుదేశం, కాంగ్రెస్‌ అభ్యర్థులే ప్రధానంగా పోటీలో ఉన్నారు. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే ఎనిమిదో నియోజకవర్గమైన సంతనూతలపాడు… బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో ఉంది. అన్ని స్థానాల్లోనూ హోరాహోరీ నెలకొంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీలే అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. గతంలో వైసిపికి ఉన్న ఊపు ఇప్పుడు లేదు. తెలుగుదేశం ఇతర పార్టీలతో జతకట్టడంతో కొంత బలం పెరిగింది. అయితే బిజెపితో కలవడం వల్ల మైనార్టీలు దూరమవుతారనే భయం ఉంది. ఏదేమైనా అభ్యర్థులు స్థానికంగా ఉండే పరిచయాలు, ఆర్థిక సంబంధాలు, సేవా కార్యక్రమాలతోనే ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే అగ్రనేతలు ఒకటీరెండు సార్లు జిల్లాకు వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు ఒకసారి జిల్లాకు రాగా.. సిఎం జగన్‌ బస్సుయాత్రతో పాటు టంగుటూరులో రెండురోజుల క్రితం ఎన్నికల సభ నిర్వహించారు. లోకేష్‌ ఒంగోలులో యువజనులతో సదస్సు నిర్వహించగా.. బాలకృష్ణ కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించారు.

ఎంపి స్థానంలో ఇద్దరు నేతలూ కుస్తీ….
వైసిపి, తెలుగుదేశం అభ్యర్ధులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి..మొన్నటివరకూ వైసిపిలోనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. గెలుపు కోసం కుస్తీలు పడుతున్నారు. భాస్కరరెడ్డి తిరుపతి జిల్లా నుండి వలస వచ్చారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. చెవిరెడ్డిని ఇక్కడ పోటీలో దింపడం వ్యూహాత్మకమే. చెవిరెడ్డి మండల కేంద్రాల్లో పరిచయ వేదికల పేరుతో భారీగా విందు భోజనాలు ఏర్పాటు చేయడం హైలైట్‌గా నిలిచింది. అసెంబ్లీ అభ్యర్థులకు ఆయనే తెరచాటున అన్ని విధాలా చూసుకుంటున్నారనే చర్చ ఉంది. ప్రచారం కన్నా సమీకరణలు పెంచుకునేందుకు జరుగుతున్న భేటీలే కీలకంగా మారాయి. మాగుంట… తన కుటుంబం రాజకీయ నేపథ్యం రీత్యా గెలుపు కోసం అన్ని వ్యూహాలూ పన్నుతున్నారు. పశ్చిమాన తన సామాజికవర్గం నుంచి ఓటు వస్తుందనే ధీమాలో ఉన్నారు. చెవిరెడ్డిపై పట్టు సాధిస్తామనే ఆశాభావంలో ఉన్నారు. మాగుంటతో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఎక్కువ పశ్చిమప్రాంతంలో దృష్టి సారించారు. కొన్నిచోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మాగుంటే ఇప్పుడు నడిపించాల్సి వచ్చింది.

అసెంబ్లీల్లో హోరాహోరీ
తూర్పు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్దులకు, పశ్చిమాన వైసిపి అభ్యర్దులకు ఎడ్జ్‌ ఉందనే చర్చ నడుస్తోంది. జనసేన పొత్తు వల్ల ఆ సామాజికవర్గం ఓటర్లతో పాటు నేతలు కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం వైపు చేరుతున్నారు. ఒంగోలు పట్టణంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. గిద్దలూరులో…80 వేల మెజారిటీ వచ్చిన అన్నా రాంబాబును కూడా మార్కాపురం మార్చారు. మంత్రి ఆదిమూలం సురేష్‌ను యర్రగొండపాలెం నుండి కొండపికి మార్చారు. ఇలా జరిగిన కొన్ని బదిలీల వల్ల అసంతృప్తులు కొంత తగ్గి గట్టిపోటీ అనే స్థాయికి వచ్చింది. ఆదిమూలపు సురేష్‌, సంతనూతలపాడులో మంత్రి మేరుగ నాగార్జున ఇద్దరూ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఒంగోలులోనూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ మధ్య ఉత్కంఠభరిత పోరు నెలకొంది. ఇప్పటికి ముగ్గురు కార్పొరేటర్లు వైసిపిని వీడారు. చేరికలు వ్యూహాత్మకంగానే నడుస్తున్నాయి.

జిల్లా అభివృద్ధి గోవిందా..
అభ్యర్దుల ప్రచారంలో తెలుగుదేశం సూపర్‌సిక్స్‌.. వైసిపి నవతర్నాలు ఇవే ప్రధానంగా ఉన్నాయి. జిల్లా అభివృద్ధి ఎజెండా లేదు. పెండింగ్‌ ప్రాజెక్టుల ఊసేలేదు. ఉపాధి ప్రాజెక్టులు, పరిశ్రమలు తెస్తామనే మాట వినిపించడం లేదు. వెనుకబాటుపై చర్చ లేదు. రాష్ట్ర నేతల ప్రచారంలోనూ మేనిఫెస్టోల్లో ఉన్నవే తమ ఉపన్యాసాల్లో చెపుతున్నారు. జిల్లాల్లో చేపట్టే వాటిపై హామీలు కనిపించడం లేదు.

➡️