ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి: ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కర్నూలులోని శంకరయ్య నగర్ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభసూచికగా తొలుత ఎఐకెఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరులకు ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశం సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని కేరళ కిసాన్ సభ నాయకులు ఎం.విజయ కుమార్ ప్రవేశపెట్టారు. సంతాప సూచికంగా కౌన్సిల్ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఆయా రాష్ట్రాల నుంచి నాయకులు, ప్రతినిధులు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, ఎఐకెఎస్ జాతీయ నాయకులు హన్నన్ మొల్ల, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఎ.గఫూర్, ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్రెడ్డి, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఢిల్లీబాబు తదితరులు నివాళ్లర్పించిన వారిలో ఉన్నారు.