- 19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్
- రూ.400 కోట్లతో అంబేద్కర్ స్మృతి వనం
ప్రజాశక్తి-అమరావతి : నవరత్నాల పథకాల వెనుక అంబేద్కర్ స్ఫూర్తి ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ నిర్మాణం పూర్తి కాగా, అంబేద్కర్ స్మృతివనం కూడా రూపుదిద్దుకుంటుంది. ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ మహనీయుడి ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళుతున్నారని విజయసాయి కొనియాడారు. నవరత్నాల పథకాల వెనుక అంబేద్కర్ స్ఫూర్తి ఉందని అన్నారు. ఈ నెల 19న సీఎం జగన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని వెల్లడించారు. ఈ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా సమతా సభ ఏర్పాటు చేశామని, 1.20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. లేజర్ షో గానీ, డ్రోన్ షో గానీ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఈ నెల 20 నుంచి విజయవాడలో అంబేద్కర్ విగ్రహ సందర్శనకు అనుమతి ఉంటుందని తెలిపారు.