ప్రజాశక్తి-యంత్రాంగం : సంక్రాంతి పండుగ రోజు కూడా వినూత్న తరహాలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరుగని అంగన్వాడీల సమ్మె 35వ రోజుకు చేరుకుంది. విజయవాడ ధర్నాచౌక్ లో నిరవధిక నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఈ క్రమంలో తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని ప్రకటించారు. సైతం రాష్ట్ర వ్యాప్తంగా శిబిరం వద్ద డిమాండ్లతో పాటు సంక్రాంతి ముగ్గులు వేసి వినూత్న నిరసన చేశారు. సంక్రాంతి పాటల బదులుగా డిమాండ్లను తెలుపుతూ నిరసనలు తెలుపుతున్నారు. అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం ఎస్మాని ప్రయోగించిన విషయం తెలిసిందే. వేతనాలు పెంపు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని అంగన్వాడీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడలో 35వ రోజు సంక్రాంతి రోజు టెంట్ లొనే పండుగ చేస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మా
పండుగ రోజు వై.యెస్.రాజశేఖర్ రెడ్డికి బట్టలు పెట్టి, కొడుకుకి మంచి బుద్దిని ప్రసాదించి తమ వేతనం పెంచేలా చూడమని వేడుకున్న అంగన్వాడీలు
పండుగనాడు కూడా కొనసాగిన అంగన్వాడీల సమ్మె
కృష్ణా జిల్లా – అవనిగడ్డ : తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి నాడు కూడా అంగన్వాడీ కార్మికులు సమ్మె నిర్వహించారు. 35 వ రోజు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్మికులు సమ్మె నిర్వహించడంతోపాటు అక్కడే పొంగళ్ళు తయారు చేసి పండుగ నిర్వహించుకున్నారు. వీరికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం పోలినాయుడు, జనసేన పార్టీ నాయకులు గుడివాక శేషుబాబు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బండి ఆదిశేషు సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు నిర్మల జ్యోతి, ఏ నాగమణి, గాదె సుశీల, కె పాములమ్మ, కాశీ హంస, ఎం సుధారాణి, కే విజయ రాణి సమ్మె నిర్వహించారు.
గుంటూరు-పెదనందిపాడు రూరల్ : పెదనందిపాడులో అంగనవాడీలు చేస్తున్న సమ్మె సోమవారానికి 35వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా అంగన్వాడీలు సమ్మె శిబిరం వద్ద ముగ్గులు వేసి తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మండల అంగనవాడి సంఘ అధ్యక్ష కార్యదర్శులు శివపార్వతి శ్రీదేవి నాయకత్వం వహించారు.
35వ రోజు అంగన్వాడీలు నిరసన కార్యక్రమం
అమరావతి : అమరావతి తహసీల్దార్ కార్యాలయం వద్ద 35వ రోజు సోమవారం అంగన్వాడీల నిరసన సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు దీక్షా శిబిరంలో సీఎం జగన్కు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు బి. సూరిబాబు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
దర్శిలో ముగ్గులతో నిరసన
ప్రకాశం జిల్లా పొదిలిలో అంగన్వాడీల సమ్మె శిభిరాన్ని సందర్శించి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేసిన సిపియం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. అంగన్వాడీల సమ్మెకు 10వేల రూపాయలు ఆర్ధిక సహకారం ప్రకటించిన వంకాయలపాటి శాంతి 5వేల రూపాయలు ఆర్ధిక సహకారం అందించిన యు.టి.యఫ్.పొదిలి మండల శాఖ. సమ్మెకు మద్దతు తెలిపిన వి.శ్రీనివాసరావుకి, ఆర్ధిక సహకారం ప్రకటించిన వంకాయలపాటి శాంతికి, పొదిలి యు.టి.యఫ్. మండల శాఖకు పొదిలి ప్రాజెక్టు కమిటి ప్రత్యేక ధన్యవాదములు తెలిపంది. అందరితో పాటు ప్రజల సహకారంతో ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
అంగన్వాడీ కార్యకర్తల నిరవదిక సమ్మె 35 రోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, యుటిఎఫ్ జిల్లా నాయకులు, సిఐటియు జిల్లా నాయకులు, రిటైర్డ్ ఉపాధ్యాయ పెన్షనర్లు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో అంగన్వాడీల సమ్మె 35వ రోజు టెంటు వద్దె సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. గిరిజన దీంస నృత్యం చేశారు. అంగన్వాడీలకు కనిస వేతనం 26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్విట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కిల్లో మోస్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి అంగన్వాడీల న్యాయ పరమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జీ కళావతి మండల అధ్యక్షులు పి మంజుల కొర్రా లక్ష్మీ కమిడి లక్ష్మీ సాగర సుమిత్ర కన్యాకుమారి చిలకమ్మ శాంతి అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా గూడూరులో 35వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు.
కోటి సంతకాలు సేకరణ
పశ్చిమ గోదావరి జిల్లా – గణపవరం : కనీస వేతనాలు అమలు చేయాలని సమస్యలు పరిష్కారం చేయాలని గత 35 రోజులుగా సమ్మెలో భాగంగా అంగన్వాడీలు సోమవారం గణపవరంలో ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడి హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి హసీనా బేగం మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం 35 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తుందని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాలు సేకరిస్తున్నామని అన్నారు. సేకరించిన సంతకాలు జాబితా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారం అయ్యేవరకు వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకులు బి రాజేశ్వరి, డీకే వల్లి, పద్మకుమారి, రామలక్ష్మి పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా కారంచేడు మండలం వద్ద అంగన్వాడీల సమ్మెలో భాగంగా నిరసన పొంగలి చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు
ముగ్గులతో అంగన్వాడీల నిరసన
అనకాపల్లి : అనకాపల్లి అంగన్వాడి సమ్మె 35 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంక్రాంతి ముగ్గులు తో, పాటలు పాడుతూ అంగన్వాడీ టీచర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండి వైఖరితో వ్యవహరిస్తుందని విమర్శించారు. పండగలో అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాసులమ్మ, ఉమా నారాయణమ్మ, ఆదిలక్ష్మి,శ్యామల శ్యామల,ఇస్తేర్ రాణి, వెంకటలక్ష్మి, మున్నిసా, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా దరిశి ICDS ఆఫీసు వద్ద అంగన్ వాడీల సమ్మెలో భాగంగా ముగ్గులతో నిరసనలు
కళ్లకు గంతలు కట్టుకొని నిరసన
ఏలూరు జిల్లా – నూజివీడు : అంగన్వాడీ వర్కర్స్ సమ్మె 35వ రోజు సందర్భంగా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నూజివీడు అధ్యక్ష కార్యదర్శులు ఎన్ ఆర్ హనుమాన్లు, జి రాజు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ నరసింహ, అంగన్వాడి యూనియన్ నాయకులు ఆదిలక్ష్మి, జ్యోతి, విజయలక్ష్మి, కృష్ణకుమారి, అరుణ అత్తర్ మునిస మెహతా బిబి ధనలక్ష్మి, సుందరమ్మ, తదితరులు పాల్గొన్నారు.