- ముందస్తు బెయిల్ సవాల్ పిటిషన్ కొట్టివేత
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సుప్రీంకోర్టులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. చంద్రబాబుకు మంజూరైన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎపి ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎస్ఎల్పిని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం దర్మాసనం స్పష్టం చేసింది. ఎపి హైకోర్టు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులిచ్చిందని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చంద్రబాబు విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది. దీనిపై చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ.. ప్రస్తుతం ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.