- నేడు తిరిగి బస్సు యాత్ర ప్రారంభం
ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం తన బస్సు యాత్రకు విరామమిచ్చి విశాఖలోనే పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం విశాఖ నగరంలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ముగిసిన తర్వాత ఎండాడ సమీపంలోని విశాఖ ఎంపి ఎంవివి.సత్యనారాయణకు చెందిన ఎంవివి సిటీకి ఆయన వెళ్లారు. తాను యాత్ర నిర్వహిస్తున్న బస్సులోనే సోమవారం విశ్రాంతి తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, వైసిపి విశాఖ ఎంపి అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి, నాయకులు రొంగలి జగన్నాథం తదితరులు జగన్ను కలిశారు.
నేటి బస్సు యాత్ర ఇలా..
ఎండాడలోని ఎంవివి సిటీ నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర తిరిగి మొదలవుతుంది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలోని మధురవాడ, ఆనందపురంల్లో సాగుతుంది. అనంతరం ఆనందపురం హైవే వద్ద గల చెన్నా కన్వెన్షన్ సెంటర్లో సోషల్ మీడియాతో జగన్ ఇంటరాక్షన్ కానున్నారు. ఆ తరువాత తగరపువలస మీదుగా విజయనగరం జిల్లాలోని జొన్నాడకు వెళ్తారు. చెల్లూరులో సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి చింతలవలస, భోగాపురం, రణస్థలం వెళ్లి అక్కివలసలో రాత్రి బస చేస్తారు.