రైలుకిందపడి ప్రేమజంట ఆత్మహత్య

ఆదోని : ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఆదోని రైల్వే పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. రైల్వే ఎస్సై గోపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం … మంత్రాలయానికి చెందిన టీస్టాల్‌ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె మేకల నందిని (20) కర్నూలులో బిటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది ఉండటంతో రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చింది. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్నవెంకటేశులు (22) ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుని పొలం పనులు చేసుకుంటున్నాడు. చిన్నవెంకటేశు, నందినిలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నందిని గత ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో కనిపించకపోవడంతో ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు మంత్రాలయం-మటుమర్రి రైల్వేస్టేషన్ల మధ్య కి.మీ. 536/11-13 వద్ద ఉన్న టీబీ వంతెన వద్ద రైలు కిందపడి ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు కాదన్నారా.. లేక ఇతర కారణాలున్నాయో తెలియాల్సి ఉంది. ఎస్సై గోపాల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️