పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి-సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Jun 29,2024 23:56 #cpm, #demand

– ప్రాజెక్టు జాప్యంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యత తేల్చండి
-ముంపును శాస్త్రీయంగా నిర్ధారించండి
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :పోలవరం నిర్వాసితుల పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండు చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాసం కల్పించడానికి తక్షణ ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలని కోరారు. దశలతో నిమిత్తం లేకుండా ఒకేసారి ఆర్‌అండ్‌ఆర్‌ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు నిర్మాణానికి సర్వస్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు పరిహారం, పునరావాసం గురించి ప్రభుత్వాలు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు సమగ్రంగా లేవని తెలిపారు. గడిచిన పదేళ్లుగా నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా పునరావాసం కల్పించకపోవడంతోపాటు, వారు నివసిస్తున్న ప్రాంతాల్లో కనీస అభివృద్ధి లేక త్రిశంకుస్వర్గం మాదిరి నానా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రాజెక్టు అంచనాల్లో లక్షాఆరువేల కుటుంబాలు నిర్వాసితులు అవుతారని పేర్కొనగా సామాజిక ఆర్థిక సర్వే పేరిట దాన్ని 96,660కి కుదించడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ మొదటిదశ పేరుతో 20 వేలమందిని గుర్తించి అరాకొర ప్యాకేజీ అమలు చేయగా సిపిఎం, గిరిజన సంఘాలు రాష్ట్రవ్యాప్త
ఉద్యమం తరువాత కాంటూరు లెక్కలు మార్చకుండానే మరో 30 వేల కుటుంబాలు చేరుస్తామని గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈ లెక్కలకూ, శ్వేతపత్రం లెక్కలకూ పొంతన కుదరడం లేదని పేర్కొన్నారు. దశలతో నిమిత్తం లేకుండా ఒకేసారి నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పునరావాసం కల్పించేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు నిజానికి ఏళ్లు గడుస్తుంటే జనాభా పెరుగుదల, వయస్సు పెరగడంతో పద్దెనిమిదేళ్లు దాటిన వారి సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు. కానీ బాధితుల సంఖ్యను తగ్గించడం నిర్వాసితుల పట్ల అమానుషత్వమేనని పేర్కొన్నారు. 2022 వరదల్లో ఊళ్లకు ఊళ్లు గోదాట్లో మునిగిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. . కాఫర్‌డ్యాం నిర్మాణం అనంతరం ఎన్ని అడుగుల మేర నీరు నిలిచింది, ఎన్ని అవాసాలు మునిగిపోయాయన్నది లెక్కతీయాలని కోరారు. ఆ ప్రాతిపదికగా ముంపు గ్రామాలను ప్రకటించాల్సి ఉందని పేర్కొన్నారు. గతంలో చేసిన కాంటూరు లెక్కలు తప్పని గోదావరి వరద ముంపు తేల్చిందని, ముంపును శాస్త్రీయంగా నిర్థారించడానికి తిరిగి సర్వే చేపట్టాలని కోరారు. ఆగస్టు నెలలో గోదావరికి వరదలచ్చే ప్రమాదమున్నందున పరివాహక గ్రామాల ప్రజలు ముంపు బారిన పడతారని, వారి భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర అక్రమాలు జరిగినట్లు శ్వేతపత్రంలో పేర్కొన్నారని, ఇది జాతీయ ప్రాజెక్టు కనుక డ్యామ్‌ నిర్మాణంలో జరిగిన అవకతవకలు, సకాలంలో నిధులివ్వకపోవడం, నిర్వాసితులను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం దాని ఆధీనంలో సంస్థలు బాధ్యత నుండి తప్పించుకోలేవని తెలిపారు. శ్వేతపత్రంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించకుండా దాని పాపాలను కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. గత పదేళ్లలో పోలవరం నిర్మాణంలో ఆలస్యానికి పొరపాటుకు కేంద్రం బాధ్యత ఎంతో తేల్చాలని, ఎన్‌హెచ్‌పిసి, హైదరాబాద్‌ ఐఐటి వంటి సంస్థలు ప్రస్తావించిన సాంకేతిక అవకతవకలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి, ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తరుపున శ్రీనివాసరావు డిమాండు చేశారు.

➡️