భూ యాజమాన్య హక్కుల చట్టంపై సిపిఎం తీర్మానం
ప్రజాశక్తి-విజయవాడ : కార్పొరేట్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు సహాయపడే, ప్రజల భూములు లాక్కొనే భూ హక్కుల చట్టాన్ని(ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-27/2023) రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు తీర్మానం చేశాయి. ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేసింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు (5,6 ఫిబ్రవరి) విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ లో ది.31.10.2023 నుండి ‘‘భూమి యాజమాన్య హక్కుల చట్టాన్ని’’ అమలులోకి తెస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది. 5గురు అధికారులతో రాష్ట్ర ల్యాండ్ అధారిటీని ఏర్పాటు చేసిందని తెలిపింది. పరిశ్రమలకు భూమి సేకరణను సులభతరం చేయడం, భూవివాదాలను పరిష్కరించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఈ చట్టం ఉపయోగించనున్నారని పేర్కొంది. క్రింది స్థాయి కోర్టులకు వెళ్ళకుండా నిరోధించడం, భూయాజమాన్య పత్రాలు లేనివారి భూములను కార్పొరేట్ లాండ్ ఆథారిటీకి బదలాయించేందుకే ఈ చట్టం చేశారని తెలిపారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ సలహా ప్రకారం నీతిఅయోగ్ తయారు చేసిన యోడల్ యాక్ట్ ఆధారంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని హడావుడిగా సిద్ధం చేసిందని పేర్కొంది. సమగ్ర భూసర్వే సమస్యలు అనేకం పరిష్కారం కాకుండా ఉన్నాయని, ఇంతలో ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్త్తిన రుద్దిందని మండిపడింది.
రాష్ట్ర స్థాయిలో కార్పొరేట్ ల్యాండ్ అధారిటీని ఏర్పాటు చేయడం, న్యాయవ్యవప్థకు సంబంధం లేకుండా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం కోసమే ఈ చట్టం ప్రత్యేకత తెచ్చారని తెలిపింది.
విదేశీ పెట్టుబడికి ఎలాంటి అడ్డంకులు లేకుండా రైతులతో పనిలేకుండా ఎంత బాగా ఏర్పాట్లు చేస్తే ఈజ్ఆఫ్డూయింగ్ బిజినెస్లో అంతమంచి ప్రపంచ ర్యాంకు వస్తుందని భావిస్తున్నారని తెలిపింది. ప్రజల ఆస్తులను సులభంగా కాజేయవచ్చని తాపత్రయమే ఈ చట్టం తీసుకురావడంలో హడావుడి కనిపిస్తుందని పేర్కొంది.
కోర్టు కేసులు 66% భూసంబంధమైనవని ప్రభుత్వం ప్రకటిస్తున్నదని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాలు నచ్చక భూ యాజమానులు కోర్టులకు వెళ్తున్నారని తెలిపింది. లోకల్ కోర్టులకు వెళ్ళకుండా చేసి భూవివాదాలకు సరైన పరిష్కారాలు చూపని అధికారులనే ఈ బాధ్యతలలో నియమించే అవకాశం ఈ చట్టం కల్పించుతున్నదని పేర్కొంది. జిల్లా అప్పిలేట్ అధికారుల తీర్పులపై హైకోర్టులకు వెళ్ళవలసి వస్తుందని, ఇది సామాన్యులకు సాధ్యం అయ్యేది కాదని స్పష్టం చేశారు.
ఎంతో కాలంపైగా చెట్టుపుట్ట చదును చేసుకున్న వాళ్ళు వివిధ సేవలందిస్తూ ఎలాంటి భూ యాజమాన్య కాగితాలు లేనివాళ్ళు ఆ భూముల నుండి గెంటి వేయబడతారని పేర్కొంది. గ్రామీణ, పట్టణ భూయజమాన్యలందరూ వారి భూ ఆధారాలను సమర్పించమంటున్నదని, దీనితో వారి ఎజెండా ప్రారంభమవుతుందని పేర్కొంది.
కొత్త వివాదాలను సృష్టిస్తూ, పేద ప్రజలను ఆ భూములనుండి తరిమివేస్తూ, న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్ళకుండా చేసే ఈ ప్రజావ్యతిరేక ‘‘భూహక్కుల చట్టాన్ని’’ రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీనికోసం రైతులు, పట్టణ ప్రజలు, లాయర్లు చేస్తున్న ఆందోళనకు సిపిఎం మద్దతు తెలిపింది.