– జగన్కు పతనం మొదలైంది : దస్తగిరి
ప్రజాశక్తి – పులివెందుల టౌన్ (వైఎస్ఆర్ జిల్లా) :పులివెందులలో ప్రజాస్వామ్యం కనిపించలేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పతనం మొదలైందని జై భీమ్ పార్టీ అభ్యర్థి దస్తగిరి పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో గురువారం నామినేషన్ వేసిన అనంతరం పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్తో కలిసి దస్తగిరి విలేకరులతో మాట్లాడారు. తాను నామినేషన్ వేసేందుకు సిద్ధం కాగా పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని, గురువారం ఉదయం నామినేషన్ వేయడానికి అనుమతులు తీసుకున్నానని, ఉదయం నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సాయంత్రం మూడు గంటలల్లోపు నామినేషన్లు వేయాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొన్నారని చెప్పారు. తాను నామినేషన్ వేయడానికి ర్యాలీగా రావాలని అనుకున్నానని, కానీ పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమ కుటుంబంలో ఎవరికీ సంబంధం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. మైకు ఎవరికీ ఇవ్వకుండా జగన్ మాత్రమే మాట్లాడడం సరికాదని, ప్రజల చేతికి మైకు ఇచ్చి ఉంటే వివేకాను ఎవరు చంపారో వారే సమాధానం చెప్పి ఉండేవారని పేర్కొన్నారు. వైసిపి పతనం ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని అన్నారు.