ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో రెండ్రోజులుగా తాగునీరు కలుషితమై దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరు ప్రాంతాలకు చెందిన 21 మంది కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)లో చేరారు. చికిత్స పొందుతూ స్థానిక శారదా కాలనీకి చెందిన ఎం.పద్మ (18), రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగడిగుంటకు చెందిన కొర్రపాటి ఓబులేసు (40) మరణించారు. శారదాకాలనీ, శ్రీనగర్కు చెందిన ఆరుగురు స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో, మరో 13 మంది వేర్వేరు అర్బన్ హెల్త్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కొలుకున్న తర్వాత కొందరు డిశ్చార్జి అయ్యారు. పులిచింతల నుంచి వస్తున్న నీటిలో కలుషితం ఎక్కువగా ఉందని, క్లోరినేషన్ చేసి నీటిని సరఫరా చేస్తామని కమిషనర్ కీర్తి తెలిపారు. మృతులు ఇతర కారణాల వల్ల చనిపోయి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. కమిషనర్ను జనసేన, టిడిపి నాయకులు ఘెరావ్ చేశారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు కారును సిపిఐ నాయకులు అడ్డుకున్నారు. బాధితులను సిపిఎం నాయకులు పరామర్శించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/20-8.jpg)