నేటి నుంచే పెన్షన్ల పంపిణీ

May 1,2024 08:40 #AP, #pentions

అమరావతి: పెన్షన్‌దారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే కాగా.. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా.. ఇవాళ ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్‌ డబ్బులను జమ చేయనున్నారు. మే 1న పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. డీబీటీ పంపిణీలో ఎవరికైనా మిస్‌ అయితే 3న ఇంటికే పింఛన్‌ డబ్బులను తీసుకెళ్లి పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బ్యాకు అకౌంటు ఆధార్‌ లింక్‌ కాని వారికి సిబ్బంది ఇంటివద్దకే పెన్షన్‌ పంపిణీ చేయనున్నారు.
అయితే, అసలే ఎండలు మండిపోతున్న తరుణంలో.. సచివాలయాలకు ఎవరూ ఎండనపడి రావద్దని అధికారులు సూచించారు.. యూపీఐ పేమెంట్‌లు అందుబాటులో ఉండటంతో బ్యాంకు ఖాతాలకు బదిలీ త్వరగా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకుల నుంచి తీసుకురావాల్సిన సొమ్ము కూడా తక్కువే కావడంతో పెన్షన్ల పంపిణీ సులభతరం కానుంది. ఏపీలో 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు ఉండగా.. 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకుల్లో జమ చేయనున్నారు. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్‌ పంపిణీ చేయనున్నారు అధికారులు. కాగా.. ఇంతకు ముందు వాలంటీర్ల ద్వారా పింఛన్‌ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పెన్షన్‌ పంపిణీ నుంచి పక్కన పెట్టిన ఈసీ.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించింది.. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పెన్షన్‌ పంపిణీ విధివిధానాల్లో అధికారులు మార్పులు చేపట్టారు. గత నెల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ సారి ఇబ్బంది లేకుండా.. నేడు అకౌంట్లలో డబ్బులు చేస్తారు.. ఏదైనా సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తారు.

➡️