- తొమ్మిదిమంది మత్స్యకారులకు గాయాలు
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా బోటులో ఉన్న సిలిండర్ పేలడంతో తొమ్మిది మంది మత్స్యకారులు గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ల దూరంలోగల కాకినాడ తీరానికి సమీపంలోని వాకలపూడి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది. బోటులోని సిబ్బంది ఇచ్చిన సమాచారంతో విశాఖపట్నం నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్లో సంఘటనా ప్రాంతానికి కోస్ట్గార్డు రక్షక దళం చేరుకుంది. గాయపడిన మత్స్యకారులను కోస్ట్ గార్డు నౌక సిజిఎస్ వీరలో విశాఖ తీరానికి తీసుకొచ్చింది. అనంతరం చికిత్స నిమిత్తం కెజిహెచ్కు తరలించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఆర్.సత్తిబాబు, నాయేటి వజ్రం, ఎస్.సత్తిబాబు, కె.ధర్మారావు, స్వల్పంగా గాయపడిన వారిలో వై.సత్తిబాబు, ఎం.భైరవ, ఆర్.గంగాద్రి, డి.వీరబాబు, డి.శ్రీను ఉన్నారు. ప్రమాదానికి గురైన వారంతా కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన వారిని కోస్ట్ గార్డ్ అధికారి ప్రకాష్ తెలిపారు. క్షతగాత్రులను మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కర్రి చంద్రశేఖర్ పరామర్శించారు.