ఏలూరు : జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట- పంగిడిగూడెం వద్ద జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను రైతులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్న రైతులు అక్కడే ధర్నా చేపట్టారు. రైతు సంఘం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ … గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం న్యాయమైన పరిహారమివ్వాలన్నారు. ఆర్బిట్రేషన్ పిటిషన్ల విచారణ వెంటనే చేపట్టాలన్నారు. సర్వీసు రోడ్లు, అండర్ పాస్లు నిర్మించాలన్నారు. ఉద్యాన, వ్యాపార పంటలకు తగిన పరిహారమివ్వాలన్నారు. బోర్లు కోల్పోయినవారికి ఉచితంగా బోర్లను వేయాలని డిమాండ్ చేశారు.