- జగన్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే : సునీత
ప్రజాశక్తి -పులివెందుల రూరల్ : సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే చెబుతున్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని భాకరాపురంలోని వివేకా నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను ఆమె పవర్ ప్రజెంట్ ద్వారా వివరించారు. వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేళ్లయినా ఇంత వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి, పులివెందుల టిడిపి ఇన్ఛార్జి బీటెక్ రవిలే తన చిన్నాన్న వివేకాను హత్య చేయించారంటూ జగన్ ఆరోపించారని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటికీ తనకు న్యాయం జరగలేదన్నారు. వివేకానందరెడ్డిని టిడిపి నాయకులు చంపి ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పులివెందుల, కడపలో ప్రజాస్వామ్యంలేదని విమర్శించారు. నిందితులకు ఓటు వేయవద్దని కడప కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని కోరారు. పదవి కోల్పోయే స్థితిలో జగన్ ఉన్నాడని అన్నారు. ఎలాంటి భయాలకూ భయపడకుండా ప్రజలు న్యాయానికి ఓట్లు వేయాలని కోరారు.