- టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవమర్ రెడ్డి పేదల భూములను తన కుమారుడికి అప్పగించేందుకు జివో 596ను విడుదల చేశారని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిఎస్ భూ వ్యవహారాలకు చెందిన ఫైల్స్ చూడకుండా ఎన్నికల కమిషన్ నియంత్రించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి సిబిఐ దర్యాప్తునకు ఆదేశించి పూర్తి నిజానిజాలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు వెబ్కాస్టింగ్ బటన్ నొక్కుతున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని టిడిపి కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
జగన్ కనుసన్నల్లో ఐఎఎస్ పదవులు : దేవినేని ఉమా
అర్హత ఉన్న అధికారులకు అన్యాయం చేసి అయిన వారికి ఐఎఎస్ పదవులను కట్టబెట్టేందుకు జగన్ కనుసన్నల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టిడిపి నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఎఎస్ నియామకాల నోటిఫికేషన్పై గోప్యత ఎందుకని? గడువు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అధికార దాహంతో దాడులు దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని జగన్ కుట్ర చేస్తున్నారని టిడిపి నేతలు ఎన్బి సుధాకర్ రెడ్డి, సూరా సుధాకర్రెడ్డి మరో సమావేశంలో ఆరోపించారు. ఓటమి ఖాయమని భావించిన వైసిపి రౌడీ మూకలు చంద్రగిరి, పుంగనూరు, తాడిపత్రి నియోజకవర్గాల్లో తమ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడ్డారని చెప్పారు.