ప్రజాశక్తి – తిరుమల : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి పరిపాలనా భవనంలో డయల్ యువర్ ఇఒ కార్యక్రమం శుక్రవారం జరిగింది. 29 మంది భక్తులు 38 సమస్యలను ఫోన్ ద్వారా ఇఒకు తెలియజేశారు. తొలుత టిటిడి ఆధ్వర్యంలో తొలిసారిగా ముద్రించిన తెలుగు కేలండర్ను ఆవిష్కరించారు. వచ్చే వారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఇఒ ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 9న ఉగాదిని పురస్కరించుకుని టిటిడి ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారని తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉంటుందన్నారు.