బిజెపిని వైసిపి బలపర్చడం విచారకరం – సిపిఎం రాష్ట్ర కమిటీ

Jun 27,2024 00:02 #CPM State Committee, #prakatana

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :లోక్‌సభ స్పీకరు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని వైసిపి బలపర్చడం విచారకరమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైసిపి చర్య లౌకికతత్వాన్ని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదు దశాబ్దాల దేశ చరిత్రలో స్పీకరు అధికారపక్షం, డిప్యూటీ స్పీకర్‌ ప్రతిపక్షం తీసుకుంటూ వస్తున్న సంప్రదాయాన్ని మోడీ ప్రభుత్వం తిరస్కరించడం వల్లే ప్రతిపక్షాలు (ఇండియా బ్లాక్‌ పార్టీలు) స్పీకర్‌ పదవికి పోటీపడ్డాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను, పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడాలన్న లక్ష్యంతోనే ఆ పని చేసిందని తెలిపారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్షానికి బలం చేకూర్చడం ద్వారానే నిరంకుశ పోకడలను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, కానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సభ్యులు అధికార పార్టీని బలపరచడం ద్వారా మోడీ ప్రభుత్వం నిరంకుశ విధానాలకు మద్దతు తెలపడం గర్హనీయమని పేర్కొన్నారు. శాసనసభలో 10 శాతం సభ్యులు లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్న వైసిపి కేంద్రంలో మాత్రం ప్రజాస్వామ్య వైఖరిని బలపరచకపోవడం ఆ పార్టీ ద్వంద్వ నీతిని వెల్లడిస్తోందని తెలిపారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడటం కోసం డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలని కోరితే సమంజసంగా ఉండేదని అన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల వైఖరులను ప్రజలు నిరసించాలని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిలబెట్టేలా వారిపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది.

➡️