మంగళగిరి (గుంటూరు) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన పోలింగ్ సిబ్బందిని కలిశారు. పవన్ కల్యాణ్ చేతి వేలిపై సిరా ముద్ర వేసి ఈవీఎం మిషన్ దగ్గరకు సిబ్బంది పంపించడంతో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ బరిలో ఉన్నారు. పవన్ రాకతో అక్కడ అభిమానుల సందడి నెలకొంది. అభిమానులంతా పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకోని.. అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ … ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల శ్రేణులు సహకరించాలని కోరారు. అటు తన అభిమానులకు సైతం పవన్ సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర గుంపులు, గుంపులుగా ఉండొద్దు అని చెప్పారు.