నేడు కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై గురువారం తుది తీర్పు రానుంది. మొదట మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌ (ఈడీ) అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రౌస్‌ అవెన్యూ కోర్టు జుడీషియల్‌ కస్టడీ విధించింది. ఆ తర్వాత విచారణలో భాగంగా ఏప్రిల్‌ 11వ తేదీన సీబీఐ అరెస్ట్‌ చేసింది. దీంతో తనకు సీబీఐ కేసులో బెయిల్‌ కావాలని ఆమె రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే, సీబీఐ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం ఆమెకు బెయిల్‌ మంజూరు చేయొద్దని కోర్టుకు తెలిపారు. లిక్కర్‌ స్కామ్‌లో కవిత కీలకమైన వ్యక్తి అని సీబీఐ పేర్కొంది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో కవిత బెయిల్‌పై నేడు న్యాయస్థానం తీర్పును వెల్లడించనుంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్‌ను న్యాయస్థానం తిరిస్కరించిన విషయం తెలిసిందే.

➡️