- స్టీల్ప్లాంట్ ఎస్సి, ఎస్టి ఎంప్లాయీస్ అసోసియేషన్
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్టీల్ప్లాంట్ ఎస్సి, ఎస్టి ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు బొండా తౌడన్న, భయ్యా మల్లయ్య అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1193వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ప్లాంట్ ఎస్సి, ఎస్టి ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటుపరమైతే రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందన్నారు. రిజర్వేషన్ల తొలగింపునకు బిజెపి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. వీటిని ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని కోరారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతగానో దోహదపడిందని గుర్తుచేశారు.