ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎపి సిఐడి సోషల్ వింగ్ గతేడాది చేపట్టిన స్వేచ్ఛా కార్యక్రమం ద్వారా 1,506 బాల కార్మికులకు విముక్తి కల్పించింది. ఈ మేరకు ఎపి సిఐడి ఉమెన్ ప్రొటక్షన్ సెల్ ఎస్పి కెజివి సరిత 2023 వార్షిక నివేదికను విడుదల చేశారు. 2023లో ఎపి సిఐడి సోషల్ వింగ్ ద్వారా నాలుగు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి బాల కార్మికులకు విముక్తి కల్పించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఇటుకల బట్టీలు, 39 వర్క్షాప్లు, రెండు పెయింటింగ్ వర్క్స్లో, 62 మెకానిక్ వర్క్షాప్లు, 10 హోటల్స్, 18 ఫ్యాక్టరీలతోపాటు 140 ఇతర సంస్థలపై ఆకస్మిక దాడులు నిర్వహించి 1,506 మంది బాలలకు విముక్తి కల్పించినట్లు పేర్కొన్నారు. ఇందులో బాలికలు 204, 1,302 మంది బాలురుకు విముక్తి కల్పించామని తెలిపారు. వీరిలో ఎక్కువ మంది ఆర్థిక పరిస్థితుల వల్లే చదువులు మానేసి పనులకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. 897 మంది పిల్లలను బడుల్లో చేర్పించామని తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 49 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/child-labour-copy.jpg)