- ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న సిబ్బంది గురువారం విజయనగరంలోని అయ్యన్నపేట మద్యం దుకాణం వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల నేతలు సాయిరెడ్డి, కొసర దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో 580 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. నూతన మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తి వేసి పాత విధానంలో కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. ఇదే జరిగితే తాము ఉద్యోగాలు కోల్పోతామని, తమతోపాటు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా విధులుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ధర్నాలో యూనియన్ నేతలు, ఎపి బేవరేజెస్ కార్పొరేషన్ సూపర్వైజర్లు, సేల్స్మెన్లు, సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.