వెంకటరెడ్డికి ఆళ్ల రామకృష్ణారెడ్డి పరామర్శ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రశాంతంగా వున్న మంగళగిరిలో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న నారా లోకేష్పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. వైసిపి కార్యకర్త మేకా వెంకటరెడ్డిని టిడిపి నాయకులు బైకుతో గుద్ది హత్యాయత్నం చేశారని ఆరోపించారు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరెడ్డిని శుక్రవారం పరామర్శించిన అనంతరం వారు తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వెంకటరెడ్డి చావు బతుకుల మధ్య పోరాడుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు టిడిపియే బాధ్యత వహించాలన్నారు.
టిడిపి సోషల్ మీడియాపై చర్యలు తీసుకోండి
సిఇఒకు వినతి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైసిపిపై దుష్ప్రచారానికి పాల్పడుతున్న టిడిపి సోషల్ మీడియా విభాగంపై చర్యలు తీసుకోవాలని వైసిపి కోరింది. ఈ మేరకు సిఇఒ ఎంకె మీనాను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు నారాయణమూర్తి, లీగల్ సెల్ నాయకులు శ్రీనివాసరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. టిడిపి సోషల్ మీడియా విభాగం యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, రీల్స్ ద్వారా వైసిపిపై దుష్ప్రచారం చేస్తోందని వివరించారు. టిడిపి అధినేత చంద్రబాబును ఇందుకు బాధ్యుల్ని చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.