- ఎర్రగుంట్ల, ఆదోనిలో రాజ్నాధ్సింగ్
ప్రజాశక్తి – కడప, కర్నూలు ప్రతినిధులు : రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, మైన్స్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్సింగ్ ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోనూ, కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్డిఎ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.13.5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జమిలి ఎన్నికలు, జమ్ముకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి వాటి గురించి ఆయన మాట్లాడుతూ బిజెపి చర్యలను సమర్థించుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు ఇచ్చినా వాటిని ఖర్చు చేయడంలో వైసిపి విఫలమైందన్నారు. కడప స్టీల్ గురించి, రాయలసీమ ప్రాంతాభివృద్ధికి బిజెపి ఏం చేసిందనే విషయంపైన కానీ ఆయన నోరు మెదపలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని కూడా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి స్థానిక నేతలు పాల్గొన్నారు.