హైదరాబాద్ : మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగుబాటు తెలంగాణలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. పిల్లర్ల కుంగుబాటుపై జయశంకర్ జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసును సీబీఐకి బదలాయించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ దాఖలు చేశారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నవంబర్ 1వ తేదీన ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేయాలని పిటిషన్లో కోరారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.86 వేల కోట్లు సేకరించడంపై కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలని విన్నవించారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/ts-high-court.jpg)