4వ రోజుకు పారిశుధ్య కార్మికుల సమ్మె
ప్రజాశక్తి-యంత్రాంగం : మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్, ఔట్సోర్సింగ్ కార్మికులకు సిఎం హామీ ఇచ్చిన విధంగా సమానపనికి సమానవేతనం, ఉద్యోగాల పర్మినెంటు, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్కు అలవెన్సు, క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 జీతం తదితర డిమాండ్లపై చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. వారి డిమాండ్ల నెరవేరే వరకు సమ్మె విరమించేదే లేదని రాష్ట్ర వ్యాప్తంగా పలు రూపాల్లో నిరసనలు చేస్తున్నారు.
నరసరావుపేటలో మునిసిపల్ కార్మికుల నిరవధిక సమ్మెలో మెడలకు ఉరి తాడు తగిలించుకొని నిరసన తెలుపుతున్న మునిసిపల్ కార్మికులు
గుంటూరు – పొన్నూరు రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నాలుగవ రోజుకు చేరుకుంది. నిడుబ్రోలు కల్పన బిల్డింగ్ వద్ద పొన్నూరు పురపాలక సంఘం వెహికల్ ని ఆపిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. సమ్మెలో పాల్గొన్న దండా లక్ష్మీనారాయణ, నిమ్మకూరి రమేష్ బాబు.
పార్వతీపురం మన్యం జిల్లాలో డిమాండ్లు నెరవేర్చాలని ఉరికి వేలాడుతూ నిరసన
ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఉరితాళ్ళతో నిరసన
కడప – మైదుకూరు: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా మైదుకూరు మున్సిపల్ కార్మికులు ఉరితాళ్ళతో తమ నిరసన తెలిపారు. శుక్రవారం నాలుగో రోజుకు చేరుకున్న నిరవధిక సమ్మెలో భాగంగా కార్మికులు మెడకు ఉరితాడు చుట్టుకొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ అప్కస్ ను రద్దుచేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. సిఐటియు ట్రెజర్ జి చిన్న, లక్ష్మయ్య, కటసుబ్బయ్య, పుల్లమ్మ, విశ్వనాథం పాల్గొన్నారు.
డా.బిఆర్. అంబేద్కర్ కోనసీమ – మండపేట : మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లు తక్షణం పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వంతో కార్మిక సంఘ నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్య అన్నారు. మరిన్ని సంఘాలను కలుపుకొని డిమాండ్ల సాధన లక్ష్యంగా సమ్మె ఉధృతం చేసేందుకు ముందుకు సాగుతున్నమన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు లోవరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.