-పనిముట్లతో ర్యాలీలు
-ఎక్కడకక్కడ నిరసనలు
ప్రజాశక్తి- యంత్రాంగం :మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యాన విధుల బహిష్కరించి వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల ముందు ధర్నా చేశారు. పలు జిల్లాల్లో పనిముట్లతో ర్యాలీలు నిర్వహించారు. ‘పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. వీరి పోరాటానికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో విశాఖ నగరంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. అనకాపల్లిలోని జివిఎంసి జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నర్సీపట్నంలో ర్యాలీ చేశారు. ఎన్టిఆర్ జిల్లా విజయవాడలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పాల్గని మద్దతు తెలిపారు. ధర్నా చౌక్ ధర్నాలో వారు మాట్లాడుతూ ఆయా రంగాల్లోని ఉద్యోగ, కార్మికులకు ఇచ్చిన హామీలను సిఎం జగన్మోహన్రెడ్డి అమలు చేయకపోవడంతో లక్షలాదిమంది రోడ్డు మీదకు రావాల్సి వస్తోందన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గని మద్దతు తెలిపారు. తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామలో కార్మికులు విధులు బహిష్కరించారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడల్లో మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, గూడూరులో ధర్నా చేశారు. కోనసీమ జిల్లా మండపేట, రామచంద్రపురం, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, తుని మున్సిపల్ కార్యాలయాలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లాలో జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య, రాయచోటి, రైల్వేకోడూరు, బి.కొత్తకోట సమ్మెలో పాల్గన్నారు. అనంతపురంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద బైటాయించారు. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, మడకశిర, హిందూపురం మున్సిపల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు. విజయనగరం నగర పాలక సంస్థ, జిల్లాలోని బబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల, రాజాం నగర పంచాయతీల్లో, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపాలిటీల్లో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీల్లో విధులు బహిష్కరించారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. మున్సిపల్ కమిషనర్ హరితకు వినతిపత్రం ఇచ్చారు. సూల్లూరుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పుత్తూరు మున్సిపాల్టీలో విధులు బహిష్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ధర్నా చేశారు. తాడేపల్లిగూడెం, ఏలూరులో చీపుర్లు, పారలతో ర్యాలీ నిర్వహించారు. తణుకు, ఆకివీడు, నూజివీడులో విధులు బహిష్కరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, జిల్లా కేంద్రమైన బాపట్ల, జిల్లాలోని అద్దంకి, చీరాలలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నెల్లూరులో చీపుర్లు, పనిముట్లతో ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయం ముందు తాడేపల్లి పట్టణం, రూరల్, రాజధాని ప్రాంత మున్సిపల్ కార్మికులు సమ్మె శిబిరం నిర్వహించారు. వీరికి కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మద్దతు తెలిపి ప్రసంగించారు. మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడంలేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లలో కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.