- ఈదురు గాలులకు పోలింగ్ పరికరాల పంపిణీ కేంద్రం వద్ద కుప్పకూలిన టెంట్లు
- పోలింగ్ సామగ్రి తీసుకెళ్లేందుకు నానా ఇబ్బందులు
ప్రజాశక్తి-కొత్తపేట(అంబేద్కర్ కోనసీమ) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్తపేటలో పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేశారు. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సిబ్బంది కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్ వద్ద ఈవీఎం తదితర పరికరాలను అధికారులు అందజేశారు. అయితే అనుకోకుండా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు సిబ్బంది ఉండటానికి వేసిన టెంట్లు కూలిపోయాయి. అలాగే తమకు ఇచ్చిన సామగ్రిని తీసుకు వెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం దాటికి మోకాళ్ళ లోతు నీరు బురద గ్రౌండ్ లోకి చేరడంతో ఇచ్చిన సామగ్రితో బయటపడడానికి అవస్థలు పడ్డారు.గ్రౌండ్లో సిబ్బంది ఎక్కిన బస్సులు ముందుకు కదలక మొరాయించాయి.దీంతో జేసీబీల సహాయంతో వాటిని ముందుకు కదిలించారు.మరోవైపు భోజన సదుపాయాలు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయని పలువురు సిబ్బంది వాపోయారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే వెల్లడించినా తగిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.