- తెలంగాణ సిఎం హామీ
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : హెచ్సియు విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రోహిత్ వేముల కేసులో నిందితుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు క్లోజర్ రిపోర్ట్ సమర్పించడం, కుటుంబ సభ్యులు, విద్యార్ధి సంఘాల ఆందోళనతో కేసు రీ ఓపెన్ చేస్తామని డిజిపి ప్రకటించిన నేపథ్యంలో రోహిత్ వేముల తల్లి రాధిక, ఇతర కుటుంబ సభ్యులు, విద్యార్ధి సంఘాల నాయకులు శనివారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని ఆమె సిఎంను కోరారు. కేసు పునర్విచారణ చేపట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తామని ఆమెకు సిఎం హామీ ఇచ్చారు.