- సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఇబిసి నేస్తం వంటి పథకాలకు నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దీనిపై బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. గత ఫిబ్రవరి, మార్చి మాసాల్లోనే ముఖ్యమంత్రి రైతుల పెట్టుబడి రాయితీ, విద్యాదీవెన, ఆసరా వంటి పథకాలకు బటన్ నొక్కినా ఆయా పథకాల లబ్ధిదారులకు నగదు జమ కాలేదని తెలిపారు. అయితే మే 10, 11 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు మొత్తాన్ని వేసేందుకు సిద్ధపడిందని పేర్కొన్నారు. ఎన్నికల కారణంగా పోలింగు ముగిసేంత వరకు లబ్ధిదారుల ఖాతాల్లో ఎలాంటి నగదు బదిలీ చేయకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశించిందని వివరించారు. మే 13న పోలింగు ముగిసిన నేపథ్యంలో ఆయా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు.