ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాటని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 33 మండలాల్లోనూ, సోమవారం 64 మండలాల్లోనూ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రెండు నుండి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు వారం రోజులుగా అనేక మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రెండు, మూడు జిల్లాలు మినహాయించి రాష్ట్రమంతటా 37 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైంది. అనంతపురం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, నంద్యాల తదితర జిల్ల్లాల్లో సరాసరి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవగా.. మొత్తం 52 మండలాల్లో వడగాల్పులు వీచాయి.