- ప్రమాదంలో విద్యా రంగం
- జెఎన్యుఎస్యు అధ్యక్షురాలు ఐషీఘోష్
ప్రజాశక్తి-అల్లూరి సీతారామరాజు నగర్ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : దేశంలో విద్యా రంగం ప్రమాదంలో ఉందని, దీనికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాలని జెఎన్యుఎస్యు అధ్యక్షురాలు ఐషీఘోష్ పిలుపు ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు నగర్ (అంబేద్కర్ భవన్)లో శుక్రవారం జరిగిన ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలో ఐషీఘోష్ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉందని, మోడీ సర్కార్ వచ్చిన తరువాత విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారని విమర్శించారు. చరిత్ర పుస్తకాల నుంచి చాలా ముఖ్యమైన ఘట్టాలను తొలగించడం, చరిత్రను మార్చి రాయడం వంటి మోడీ సర్కార్ చర్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రిటిష్ పాలనకు, భూర్జువా, భూస్వామ్య, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయని ఆర్ఎస్ఎస్ సూచనతో ఇప్పుడు చరిత్ర పుస్తకాల్లో పాఠ్యాంశాలు పొందుపరిస్తున్నారని పేర్కొన్నారు. 2014 నుంచి దేశ పురోగతి జరగటం లేదని అన్నారు. స్వాతంత్ర పోరాట వారసత్వంతో ఎస్ఎఫ్ఐ ఉందని, కానీ ఎబివిపి లాంటి సంఘాలకు బ్రిటిష్ పాలకులు 30 క్షమాపణ లేఖలు రాసిన సావర్కర్, గోల్వాల్కర్ల వారసత్వముందని తెలిపారు. సమాజం ప్రమాదంలో ఉన్నప్పుడు విద్యార్థులు, యువత ముందుండి పోరాడాలని భగత్సింగ్ పిలుపు ఇచ్చారన్నారు. ఇప్పుడు సమాజం ప్రమాదంలో పడిందని, ఇప్పుడు భగత్సింగ్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని పోరాటాలను నిర్మించాలని పిలుపు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్ చేశారని విమర్శించారు. అధాని, అంబానీలకు వేల ఎకరాలు దోచిపెడుతున్నారని, కానీ భూమిలేని పేదలకు ఒక్క సెంటు కూడా ఇవ్వటం లేదని అన్నారు. 1970 ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల హక్కులను కాలరాస్తే, 2014 నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ అమలు అవుతుందని విమర్శించారు.