- కోవూరు, పొదలకూరులో కేంద్ర బృందం పర్యటన
ప్రజాశక్తి-పొదలకూరు/కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు, పొదలకూరు మండలాల్లో బర్డ్ఫ్లూ వ్యాధి నిర్ధారణ కోసం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ బృందం సోమవారం విస్తృత తనిఖీలు చేపట్టింది. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. పలు నమూనాలను సేకరించింది. స్థానికుల నుంచి సమాచారం సేకరించి, వారి నుంచి రక్త నమునాలు తీసుకుంది. కేంద్ర బృందంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ నుంచి డాక్టర్ సుస్మిత సింగల్, లేడీ హార్డింగ్ ఆస్పత్రి నుంచి డాక్టర్ గురుమిత్ కౌర్, మౌలానా అజాద్ మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ శ్రేయ శర్మ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ మల్లేశ్వరి, జిల్లా సర్వలెన్స్ వైద్యాధికారి భాస్కర్, స్థానిక వైద్యాధికారులు డాక్టర్ నరసింహారావు, కిరణ్ రిషిత, శ్రీకావ్య, ఆరోగ్య విస్తరణ అధికారి రవికుమార్, ల్యాబ్ టెక్నీషియన్ ముస్తాఫా పాల్గొన్నారు.