ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జులై నెల కోటాను ఏప్రిల్ 18న ఆన్లైన్లో టిటిడి విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం పది గంటలకు, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించి మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో ఉంచనుంది. అంగప్రదక్షిణం టోకెన్లు 23 ఉదయం పది గంటలకు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు, మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు వికలాంగులకు, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు గదుల కోటాను విడుదల చేయనుంది. 27న శ్రీవారి సేవ కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, ఒంటి గంటకు పరకామణి సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనుంది. సందర్శకులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది.