ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు

-వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని క్యాట్‌ ఆదేశం
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో :సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి, టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌) రద్దు చేేసింది. ఒకే కారణంతో ఆయనను రెండోసారి సస్పెండ్‌ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎబి వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయనకు వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని, సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్‌ ఆదేశించింది. రక్షణ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైసిపి ప్రభుత్వం వెంకటేశ్వరరావును 2020 ఏప్రిల్‌లో సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్థించింది. దీంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఎబి వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ రద్దు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్‌ చేశారో, అదే కారణంతో 2022 జూన్‌ 28న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెండ్‌ చేసింది. దీంతో, ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ బుధవారం క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

➡️