ప్రజాశక్తి – నూజివీడు రూరల్ : అనుమానాస్సద స్థితిలో బాలుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా నూజివీడులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నూజివీడులోని అమరావతి ఫర్నిచర్స్ యజమాని కోవూరి రామిరెడ్డి కుమారుడు సాయి యశ్వంత్రెడ్డి (16) స్థానిక ఆర్ఆర్ పేటలో మృతి చెంది ఉన్నాడు. శుక్రవారం ఉదయం సాయియశ్వంత్రెడ్డి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావించారు. అయితే బాలుని బెడ్రూమ్లో రక్తపు మరకలలు ఉండడంతో తమకు, సమీపంలోని మరో షాపు వారికి తగాదాలు ఉన్నాయని, తన కుమారుడిని వారే హత్య చేసి ఉంటారని మృతుని తండ్రి రామిరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ సిఐ ఎంవిఎస్ఎన్ మూర్తి తెలిపారు.