ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :డబ్బులిచ్చినా ఓటర్లు ఓటు వేస్తారో లేదోననే అపనమ్మకంతో తిరుపతి వైసిపి అభ్యర్థి అనుచరులు, టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దేవుడిపై ప్రమాణం చేయిస్తున్నారు. ‘ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాం.. మా కుటుంబ సభ్యులతోనూ వేయిస్తాం’ అని గంగమ్మ గుడి దగ్గర కర్పూరం వెలిగించి ఓటర్లతో బలవంతంగా ప్రమాణం చేయిస్తున్నారు. ఓటర్లకు బలవంతంగా మందు, డబ్బులు పంచడమే గాకుండా, ఓటు వేయాలని ప్రమాణం చేయించడాన్ని తప్పుబడుతూ తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్కు జనసేన, టిడిపి అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు కేతం జయచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు. పద్మావతిపురం, పద్మావతి యూనివర్సిటీలోని మరో బూత్ వద్ద ఓటర్ల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన బెలూన్లు, చలువ పందిళ్లు వైసిపి రంగుల్లో ఉన్నాయని, వెంటనే తొలగించాలని తిరుపతి టిడిపి జిల్లా అధ్యక్షులు నరసింహయాదవ్ ఫిర్యాదు చేశారు.