Skip to content
- నిర్లక్ష్యం చేస్తే అసలుకే ప్రమాదం
ప్రజాశక్తి -కాళ్ళ
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇంకా పోలింగ్ కు తొమ్మిది రోజులే ఉంది. ప్రస్తుతం వడగాల్పులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో తప్పనిసరిగా రాజకీయ నేతలంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఒకపక్క ప్రచారం…మరోవైపు భానుడి భగభగ…ఉక్కపోత చికాకు పుట్టిస్తోంది. వడగల్పులు వెంటాడుతున్నాయి. ఎన్నికలవేళలో పోటీచేసే అభ్యర్థులతో పాటు వారి అనుచర వర్గం ఎక్కువ సమయం బయటే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల మధ్య గడుపుతున్నారు. ఈ క్రమంలో పోటీ చేసి అభ్యర్థులు, కొందరు రాజకీయ నేతలు ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్రలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా తీరిక లేకుండా తిరగడం వల్ల చెమట రూపంలో శరీరంలోని నీరంతాపోయి డీహ్రైడేష న్ ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి, అచంట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో స్వల్పఅస్వస్థతకు గురయ్యారు. కైకలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావుశుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలో మెరుగైన చికిత్స పొందుతున్నారు.పొంచి ఉన్న డీహ్రైడేషన్ ముప్పు…ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కువ సేపు బయట తిరగడంతో నీరసం, నాలుక తడారి పోవడం జరుగుతుంది. మూత్రం రంగు మారడం వంటి లాంటి లక్షణాలు కనిపిస్తే నీళ్లు మాత్రమే కాకుండా ఓ ఆర్ ఎస్, ఉప్పు, చక్కెర కలిపి మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటివి తీసుకుంటే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి భర్తీ చేయవచ్చు.అధిక రక్త పోటు, మధుమేహం తదితర దీర్ఘ కాలిక రోగాలతో ఇబ్బంది పడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రచారంలో పాల్గనేవాళ్ళు శరీరం డీహ్రైడేట్ కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ ఎస్ తీసుకోవాలి.ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు,సరాబు సునీల్, వైద్యాధికారి, కాళ్ళ.ఎన్నికల ప్రచారం భాగంగా చాలామంది కాపీలు, టీలు ఎక్కువగా తీసుకుంటారు. దీంతో జీర్ణకోశ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. మధుమేహం, రక్తపోటు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వారి వైద్యులు సూచించిన మందులన్నీ వేసుకోవాలి. ప్రచారం తర్వాత చూద్దాంలే అనుకుంటే అది తీవ్రముప్పునకు దారి తీస్తుంది. అధిక క్యాలరీలు,చక్కెర ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇప్పటికే ఈ వ్యాధులు ఉంటే ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా బీపీ, మధుమేహ పరీక్షలు చేసుకోవాలి. ఉదయం అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇతర డ్రై ఫ్రూట్స్, ఎక్కువ పీచు ఉండే పదార్థాలు తీసుకోవాలి. సలాడ్ తో శరీరానికి చల్లదనం ఉంటుంది. ఆహారంపై అశ్రద్ధ చేస్తే మధుమేహరోగులకు షుగర్ స్థాయిలు పడిపోయి ఆ ప్రభావం అవయవాల పనితీరుపై పడుతుంది. సమయానికి తేలికపాటి ఆహారం తీసుకుంటే మేలు చేస్తుంది. ఈ వేసవి కాలంలో వైట్ రంగు కాటన్ దుస్తులు ధరించాలి. తలకు టోపీ, కర్చీఫ్ లు రక్షణగా ఉండాలి.ఎండలోంచి వచ్చిన వెంటనే మంచినీరు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగాలి. వడదెబ్బ తగిలిన వాళ్ళు ఎక్కువగా ఫ్లూయిడ్స్ పళ్ల రసాలు తీసుకోవాలి . కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ తీసుకోకుండా ఉండటమే మంచిది.