ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో దళితులపై అరాచకాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ దళితులపై దాడులు, హత్యలు ఏమాత్రం ఆగటం లేదని టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతామనే భయంతోనే, దళితులపై దాడుల చేసి ఎన్నికల్లో గెలవాలని జగన్ చూస్తున్నారన్నారు. జగన్ ఉత్తరాంధ్ర పర్యటన వెలవెలబోయిందని, ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ను తిరస్కరించినట్లు ఆయన సిద్ధం సభలు చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో వనరులన్నింటినీ జగన్ రెడ్డి ముఠా దోపిడీ చేసిందని, పెట్టుబడులను తరిమేసి గంజాయికి, డ్రగ్స్కు ఉత్తరాంధ్రను అడ్డాగా మార్చేశారని ఆరోపించారు.