అధిష్టానం ఇష్టానికే.. ఢిల్లీ చేరిన తెలంగాణ సిఎం ఎంపిక ప్రక్రియ

Dec 4,2023 08:57 #Congress, #Telangana elections

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణలో నూత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఎల్లా హోటల్‌లో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ఏల సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎంపిక చేసే అధికారం అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే, సాయంత్రం వరకు అధిష్టానం నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో పాటు ఎఐసిసి తరపున హాజరైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో పాటు, ఇతర పరిశీలకులను తక్షణమే ఢిల్లీకి రావాలని ఆదేశాలు అందాయి. దీంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధిష్టానంతో చర్చల అనంతరం నేడు (మంగళవారం) తుది నిర్ణయం వెలువడుతుందని, బుధవారం (ఆరవ తేది) ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పటికి కూడా ఖరారు కాకపోతే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించిన విధంగా తొమ్మిదవ తేది (సోనియాగాంధీ జన్మదినం) న ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. కర్ణాటకలో యడ్యూరప్ప, డికె శివకుమార్‌ మధ్య చోటుచేసుకున్న గ్రూపు రాజకీయాల కారణంగా శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడానికి దాదాపు వారం రోజుల సమయం పట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ ఆ తరహా పరిణామాలే చోటుచేసుకుంటున్నట్టుగా సమాచారం. వాస్తవానికి నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు ఖరారైనట్టు సోమవారం ఉదయం నుండి విస్తృతంగా ప్రచారమైంది. గవర్నర్‌ కార్యాలయానికి కూడా సమాచారం వెళ్లడంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. పోలీస్‌ హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఎంఎల్‌ఏల సమావేశం లాంఛనమే అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే, కాంగ్రెస్‌లో మరోరకమైన పరిణామలు చోటుచేసుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే ఎంఎల్‌ఏలు అందరూ ఎల్లా హోటల్‌కు చేరుకున్నప్పటికీ సమావేశం ప్రారంభం కాలేదు. ఎంఎల్‌ఏలు ఎదురుచూస్తుండగా డికె శివకుమార్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి సోదరులతో సమావేశమైనారు. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొనలేదు. ఈ సమావేశం జరుగుతుండగానే ఎఐసిసి పరిశీలకులు ఎల్లా హోటల్‌లో ఎంఎల్‌ఏలను విడివిడిగా కలిసి అభిప్రాయాలు సేకరించారు. ఆ తరువాత జరిగిన సిఎల్‌పి సమావేశంలో అధ్యక్షుడు ఖర్గేకు సిఎల్‌పినేతను నియమించే బాధ్యతను అప్పగిస్తున్నట్లు ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపారు. నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న సమయంలో శివకుమార్‌తో పాటు పరిశీలకులను ఢిల్లీకి తక్షణమే రావాలంటూ ఆదేశాలు అందాయి. పార్లమెంటు సమావేశాల కారణంగా ఖర్గే ఈ వ్యవహారంపై సోమవారం దృష్టి సారించలేదని చెబుతున్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగాల్సిఉంది. దాని తరువాత తెలంగాణ వ్యవహారంపై దృష్టి సారిస్తారని, ముఖ్యమంత్రితో పాటు, మంత్రి వర్గాన్ని కూడా ఖరారు చేస్తారని చెబుతున్నారు.

బిఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేత ఎవరో…!

బిఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేతపై కూడా సస్పెన్స్‌ నెలకొంది. బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏల సమావేశం ఒక హోటల్‌లో సోమవారం జరిగింది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం జరుగుతుండగానే ఎంఎల్‌ఏల నందర్ని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి రమ్మంటూ కెసిఆర్‌ నుండి పిలుపు వచ్చింది. దీంతో శాసనసభ పక్ష నేత ఎన్నిక ఉంటుందని భావించారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామని, శాసనసభ పక్ష నేతను త్వరలో ఎన్నుకుందామని, ఎన్నికల ఫలితాలపై కూడా త్వరలో సమీక్షిస్తామని ఆయన చెప్పారని సమాచారం.

➡️