తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ … అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. బయటికొచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మీడియా పాయింట్ వద్దకు చేరారు. దీంతో పోలీసులు, మార్షల్స్ కలిసి బారికేడ్లు అడ్డుపెట్టి ఆపారు. సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడవద్దనే నిబంధన ఉందని పోలీసులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలిపారు. కొత్తగా ఈ రూల్స్ ఏంటని పోలీసులతో హరీష్రావు, కెటిఆర్ వాగ్వాదానికి దిగారు. బలవంతంగా మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నించారు. స్పీకర్ నుంచి తమకు ఎలాంటి నోట్ రాలేదని బిఆర్ఎస్ నేతలు చెప్పారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ … కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు.. పోలీస్ పాలన అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సభలో మైక్ ఇవ్వరు.. బయట కూడా మాట్లాడనివ్వరా ? అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని నిరసన తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/brs-leders.jpg)