రాజధానిపై వైసిపి పిల్లి మొగ్గలుఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధాని విషయంలో వైసిపి పిల్లి మొగ్గల్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌ రాజధానిగా మరికొంతకాలం వుండాలని వైసిపి అధికార ప్రతినిధి వైవి సుబ్బారెడ్డి ప్రతిపాదించడం, దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంతపాడటం చూస్తుంటే వైసిపి ఉద్దేశపూర్వకంగానే ప్రజలను గందరగోళానికి గురిచేయడమే కాకుండా తెలంగాణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోందని విమర్శించారు. ఇటువంటి చర్చల్ని ఆపేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందు నాగార్జునసాగర్‌ వద్ద పోలీసులు మోహరించి నాటకం ఆడినట్లు ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. అలాగే అమరావతి రాజధానిగా దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వుందని, ఈ చర్య రాష్ట్ర ప్రజలకు ఏమాత్రమూ సమ్మతం కాదన్నారు. హైదరాబాద్‌ను వదిలేసి పదేళ్లు అయిందని, ఇప్పుడు హైదరాబాద్‌ రాజధాని అంటూ కొత్త చర్చను లేవదీసి మొత్తం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సరైందికాదని అన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించి అభివృద్ధి చేయకపోతే వైసిపిని ప్రజలు క్షమించరని పేర్కొన్నారు.

➡️