ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ కు కెవిపిఎస్ లేఖ
ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల కమిటీ, దానికి నిర్దేశించిన విధి విధానాల కమిటిీలో సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శిలను నియమించాలని కోరుతూ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ కు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి లేఖ రాశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్థుల తీర్పులకు విరుద్ధంగా నివేదిక ఇచ్చిన ఎంఎల్ఎ కమిటీని రద్దు చేసి, సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి సుప్రీంకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పుల్ని, కేంద్ర ప్రభుత్వ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో రిజర్వేషన్ల విధానాల్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించాలని ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు. కానీ ప్రభుత్వం ఎంఎల్ఎ కమిటీ నివేదికను అధ్యయనం చేయడానికి మాత్రమే కమిటీ వేయడం అన్యాయమని పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలు వ్యవహారానికి సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, ఆ తర్వాత సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శి పాత్ర అత్యంత కీలకమన్నారు. కానీ ఐఏఎస్ అధికారుల కమిటీలో వారిని నియమించాలని కోరారు. ప్రస్తుత జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్) ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అమలుకు అనుకూలం అని భావించి ఆయనను మినహాయించినట్లు ఉందని తెలిపారు. “ఉద్యోగి పనిచేసే పోస్టులో (ఫీడర్ క్యాడర్) సీనియారిటీని కాకుండా, ఆయన ఉద్యోగంలో చేరిన మొదటి పోస్టులో ఉన్న సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలే దక్కేవని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగడంతోనే 85వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ దానికి నిర్దేశించిన విధి విధానాల కమిటిీలో సాంఘీక సంక్షేమశాఖ కార్యదర్శి , మరియు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శిలను నియమించాలని మాల్యాద్రి కోరారు.