ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను సోమవారం టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది. బుధవారం పది గంటల వరకు సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని టిటిడి అధికారులు తెలిపారు. లక్కీడిప్ పొందినవారు అదే రోజు మధ్యాహ్నాం 12 గంటలలోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని వెల్లడించారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వర్చువల్ సేవా టికెట్ల కోటాను 22వ తేదీ ఉదయం పది గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లు మధ్యాహ్నం మూడు గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటా 23న ఉదయం పది గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లు కోటాను 24న విడుదల చేయనున్నారు.