కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. గురువారం విజయవాడలో ఆయన మీడియా తో మాట్లాడారు. రాజధాని అంశంలో ఆంధ్రప్రదేశ్కు మొదటి నుండి అన్యాయం జరుగుతోందని తెలిపారు. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి వచ్చినపుడు ఎన్జి రంగా తిరుపతిని రాజధానిగా చేయాలని ప్రతిపాదన చేస్తే అప్పటి రాజకీయాల్లో బలవంతుడైన నీలం సంజీవరెడ్డి కోరిక మేరకు కర్నూలుకు తరలిపోయిందన్నారు. ఆ తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్కు రాజధాని వెళ్లిపోయిందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తుళ్లూరులో పెడితే.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా మరికొంతకాలం వుండాలని కోరడం వైసిపి దివాళాకోరుతనం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని టిడిపి, వైసిపి భ్రష్టు పట్టించాయని విమర్శించారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తుందన్నారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరారు.