కోర్టులో సిబిఐ వాదనలు
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతివ్వొద్దని సిబిఐ న్యాయస్థానాన్ని సిబిఐ కోరింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ వైఎస్ జగన్ బుధవారం దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టులో గురువారం విచారణ జరిగింది. జగన్పై ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముఖ్యమైన కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఇటువంటి సమయంలో ఆయనకు విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వొద్దని సిబిఐ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ నెల 17 నుంచి జూన్ ఒకటి వరకు యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్ జగన్ కోర్టును అభ్యర్ధించిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.